తిరుపతి : శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 05న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, అనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు. ఉదయం 06.30 గం.ల నుండి 11.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఉదయం ధ్వజారోహణం ( కుంభ లగ్నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు), రాత్రి పెద్దశేష వాహనం ఉంటుంది. 9వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామి వారు ఊరేగుతారు. 10వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. 11న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం, 12న ఉదయం పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం) రాత్రి గరుడ వాహనం. 13న ఉదయం హనుమంత వాహనం, మధ్యాహ్నం వసంతోత్సవం (మ. 2 నుండి 3 గంటల వరకు), సాయంత్రం స్వర్ణ రథం( సా. 4 నుండి 5 గంటల వరకు), రాత్రి గజ వాహనంపై ఊరేగుతారు. 14న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 15న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, 16వ తేదీన ఉదయం చక్ర స్నానం (ఉ. 9.55 నుండి 10.15 గంటల వరకు), రాత్రి ధ్వజావరోహణం ( సా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు) నిర్వహిస్తారు.
