అనంతపురం జిల్లా : రాజకీయ విమర్శల పేరుతో హద్దులు దాటితే, అంబటి రాంబాబుకు చట్టపరమైన గట్టి సమాధానం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రావణి శ్రీ మీడియాతో మాట్లాడారు. రోజు రోజకు వైసీపీ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాంబాబు తాను మాజీ మంత్రినన్న సోయి లేకుండా కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హద్దులు దాటి, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నార బండారు శ్రావణి శ్రీ . ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి అసభ్య, దిగజారిన వ్యాఖ్యలు సమాజాన్ని తీవ్రంగా కలచి వేస్తున్నాయని వాపోయారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతి పతనానికి నిదర్శనమని అన్నారు. వ్యక్తిగత దూషణలు, బూతు రాజకీయాలు చేయడం క్షమించరాని నేరమని, ఇవి ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. సభ్య సమాజంలో జీవిస్తున్నామనే కనీస అవగాహన కూడా లేకుండా, పదే పదే దిగజారిన రాజకీయ భాషను ఉపయోగించడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు బండారు శ్రావణి శ్రీ. ఇటువంటి వ్యాఖ్యలను సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తన ఉనికిని చాటుకునేందుకు అంబటి రాంబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఆయన వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని , దానిని ఇతర నేతలు కూడా గమనించాలని హితవు పలికారు. జగన్ రెడ్డి పట్ల, ఆయన అనుచరులు వాడుతున్న భాష పట్ల ప్రజలు ఏవగించుకుంటున్నారని పేర్కొన్నారు.
