వికారాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో అత్యంత చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్కడు సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా రోడ్ కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి రోజు రోజుకు అదుపు తప్పి మాట్లాడుతున్నాడని, సోయి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. తనను సీఎంగా ఎవరూ అంగీకరించడం లేదన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
ఏ ముఖ్యమంత్రి అయినా పర్యటనకు వెళ్తే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతారని, ప్రజలకు నాలుగు మంచి మాటలు చెబుతారని కానీ సీఎం అలా కాదన్నారు. తను కేవలం బూతుల ముఖ్యమంత్రిగా మారి పోయాడని అన్నారు. పాలన చేతకాక విపక్షాల మీద నోరు పారేసు కోవడం తప్పితే ఆయన చేసింది ఏమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలుగా కేసీఆర్ ను తిట్టడం తప్పించి చేసింది ఏమీ లేదంటూ మండిపడ్డారు కేటీఆర్. ప్రతిరోజూ వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించడమే రేవంత్ రెడ్డి పని అని అన్నారు. ఈ ఎన్నికల్లో కాకుంటే కాంగ్రెస్ వాళ్లు మరో మూడు సంవత్సరాల దాకా దొరకరని హెచ్చరించారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పండి అని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్.
