విజయనగరం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయనరం జిల్లా చీపురుపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. లేక పోతే తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం పొంచి ఉందన్నారు సీఎం. ఇదిలా ఉండగా చీపురుపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు. అక్కడి నుంచి నేరుగా చీపురుపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లారు చంద్రబాబు నాయుడు. అక్కడే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో విద్యార్థినులతో ముచ్చటించారు.
వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని విద్యార్థినులకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు సీఎం. సీఎం సమక్షంలో 14 ఏళ్ల లోపు విద్యార్థినులకు వ్యాక్సిన్ వేశారు ఏఎన్ఎమ్లు. హెచ్పీవీ వల్ల ఉపయోగాల గురించి విద్యార్థినులకు తెలియ చేశారు సీఎం చంద్రబాబు. క్యాన్సర్ రాకుండా రక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని చెప్పారు . సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డుల్లోనూ వ్యాక్సినేషన్ డేటా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఆసుపత్రికి అడ్వైజరీ కమిటీని కూడా నియమించాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు.
