చ‌రిత్రను తిర‌గ రాసిన టీం ఇండియా

దేశ వ్యాప్తంగా మిన్నంటిన సంబురాలు

అహ్మ‌దాబాద్ : స‌మిష్టిగా కృషి చేస్తే ఎంత‌టి ల‌క్ష్యాన్ని అయినా ఛేదించ వ‌చ్చని నిరూపించారు సూర్య కుమార్ యాదవ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఆటగాళ్లు. నిన్న‌టి దాకా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఆటగాళ్లు ఇప్పుడు నీరాజ‌నాలు అందుకుంటున్నారు. సెంటిమెంట్ కు మంగ‌ళం పాడారు. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. భార‌త జాతి గ‌ర్వ‌ప‌డేలా, జాతీయ ప‌తాకం త‌ల ఎత్తుకునేలా ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును ఓడించి త‌మ‌కు ఎదురే లేద‌ని చాటారు. ఒక‌టా రెండా ఏకంగా ప‌లు రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. కొన్ని కొత్త రికార్డులు న‌మోద‌య్యాయి అహ్మ‌బాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో. ఇండియా గురించి, ప్ర‌త్యేకించి కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఒకానొక ద‌శ‌లో జ‌ట్టులో స్థానం కోల్పోయాడు. చివ‌ర‌కు చోటు ద‌క్కించుకున్నాడు. ఊహించ‌ని విధంగా ఇండియాను క్వార్ట‌ర్ లో ఆదుకున్నాడు. ఒంట‌రి పోరాటం చేశాడు. సెమీస్ కు చేర్చాడు. ఆపై ఇంగ్లండ్ తో జ‌రిగిన సెమీస్ లో సైతం త‌నే ఇండియాకు దిక్క‌య్యాడు. ఆపై ఫైన‌ల్ లో సైతం ముఖ్య భూమిక పోషించాడు. ఇవాళ ఇండియా స‌గ‌ర్వంగా క‌ప్ ను అందుకున్న‌ది అంటే దానికి ప్ర‌ధాన కార‌కులు సంజు శాంస‌న్, జ‌స్ప్రీత్ బుమ్రానేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 255 రన్స్ చేసింది. సంజు శాంస‌న్ 89 ప‌రుగుల‌తో రెచ్చి పోతే 52 ర‌న్స్ తో దంచి కొట్టాడు అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగితే శివం దూబే దుమ్ము రేపాడు. శివాలెత్తాడు. 8 బంతుల్లో 26 ర‌న్స్ చేశాడు. ఇక 256 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 159 ప‌ర‌గుల‌కే చాప చుట్టేసింది. 96 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన భార‌త్ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను మూడోసారి ద‌క్కించుకుంది. అరుదైన రికార్డును న‌మోదు చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!