అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు. అప్పుడు కృష్ణా డెల్టాకు నీటి సమస్య రాదన్నారు. గతంలో ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే గత పాలకుడు గోదాట్లో కలిపేశాడని ఆరోపించారు. రూ.440 కోట్లతో కట్టిన డయాఫ్రామ్ వాల్ ను ముంచేశాడని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కేంద్ర సహకారంతో రూ.1000 కోట్లతో చేపట్టి పూర్తి చేశాం అన్నారు సీఎం. కొందరు నిర్మించిన వాటిని మరికొందరు కూలుస్తుంటారని అన్నారు. మళ్లీ వాటి పునర్నిర్మాణం చేయటం జరుగుుతందని చెప్పారు. పోలవరం, అమరావతి రాజధానిని మళ్లీ పునర్నిర్మించే అవకాశం నాకు వచ్చిందన్నారు. రూ.4,660 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయకుండా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశాం అన్నారు. భవిష్యత్తులోనూ కరెంటు చార్జీలను పెంచేది లేదన్నారు.
గత పాలకులు 9 సార్లు కరెంటు ఛార్జీలు వేసి రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం వేశారని ఆరోపించారు సీఎం. సోలార్ రూఫ్ టాప్తో ప్రోజ్యూమర్ అనే విధానాన్ని తీసుకు వస్తున్నాం అన్నారు. సామాన్యులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. గంజాయి రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని పేర్కొన్నారు. హాస్టళ్లు, బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు మధ్యాహ్న భోజనం తదితర అంశాల్లో మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం అన్నారు. రూ.వెయ్యి కోట్ల ఆదాయం కోల్పోతున్నా ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని తెలిపారు.
