అమరావతి : ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. విద్యా రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మెరుగైన ఫలితాలు వచ్చేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పాఠశాల భవనాన్ని కేవలం నాలుగు గోడల నిర్మాణంగా కాకుండా, ఒక సజీవ బోధనా సాధనంగా మార్చడమే అసలు ఉద్దేశం. ఈ విధానం విద్యార్థుల విభిన్న అభ్యసన శైలులకు అనుగుణంగా ఉంటూ, చూసి నేర్చుకునే వారికి ఆకర్షణీయమైన చిత్రాలను, చూసి నేర్చుకునే వారికి నేలపై ఇంటరాక్టివ్ ఆటలను అందిస్తుంది. దీనివల్ల నెమ్మదిగా నేర్చుకునే పిల్లలు సైతం ఎలాంటి ఒత్తిడి లేకుండా విషయాలను సులభంగా అవగాహన చేసుకుంటారు. గోడలపై ఉండే సైన్స్ రేఖా చిత్రాలు లేదా స్థానిక మ్యాపులు పిల్లల్లో చక్కని జిజ్ఞాసను రేకెత్తించి, పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా స్వతంత్రంగా ఆలోచించేలా ప్రేరేపిస్తాయి. చదువును నిజ జీవితంతో, స్థానిక సంస్కృతితో అనుసంధానించడం ద్వారా అభ్యసనం మరింత అర్థవంతంగా మారుతుంది.
కొన్ని ఎంపిక చేసిన పాఠశాలలకు విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చుని కృత్యాలు చేయడానికి అనువైన ఫర్నిచర్ ఇచ్చారు. శారీరక వికాసం, ఆటల ద్వారా అభ్యసనానికి కావాల్సిన వస్తువులను సరఫరా చేశారు. గ్యారెంటీడ్ ఎఫ్.ఎల్.ఎన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 75 రోజుల యాక్షన్ ప్లాన్ బుక్స్ అందించారు . విద్యార్థుల స్థాయిని బట్టి స్ట్రీమ్ (Stream), మౌంటైన్ (Mountain), స్కై (Sky) అనే మూడు స్థాయిలలో విడివిడిగా యాక్టివిటీ షీట్లు, మెటీరియల్ ఇచ్చారు. 1 , 2 తరగతులకు ఒకటి, 3 నుండి 5 తరగతులకు మరొకటి చొప్పున టీచర్లకు గైడ్ బుక్స్ అందజేశారు. స్మార్ట్ టీవీలు , IFP ప్యానెల్స్: తరగతి గదుల్లో ఆడియో-విజువల్ బోధన కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో, ఎఫ్.ఎల్.ఎన్ మెటీరియల్లో ఉన్న క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ పాఠాలను చూసే వెసులుబాటు కల్పించారు.
ఇవన్నీ విద్యార్థులు కేవలం బట్టీ పట్టకుండా, కృత్యాధార పద్ధతిలో (Activity-based Learning) భాషను, గణితాన్ని అర్థం చేసుకోవడానికి దోహద పడతాయి. తద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మౌఖిక భాషా అభివృద్ధి( ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్), అక్షరాలను గుర్తించి చదవడం, ధారాళంగా చదవడం, అవగాహనతో చదవడం, రాత నైపుణ్యం, నంబర్ సెన్స్ , బేసిక్ ఆపరేషన్స్ (సంఖ్యా జ్ఞానం, మౌలిక గణితం వంటివి నేర్చుకోవడానికి సులభతరమవుతుంది.
