హైదరాబాద్ : ఇంటర్ బోర్డును విలీనం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఏడాది కూడా ఇంటర్ అడ్మిషన్లు యధావిధిగా కొనసాగనున్నాయి. ప్రస్తుతానికి అడ్మిషన్లు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. అసెంబ్లీ చర్చల తర్వాతే ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే విషయంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా అడ్మిషన్లకు సమయం పరిమితంగా ఉండటం, ఇంటర్మీడియట్ వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయడంలో అనేక సాంకేతిక సవాళ్లు ఉన్నాయని పేర్కొంటూ, ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లను యథావిధిగా కొనసాగించాలని అన్నారు సీఎం.
విద్యార్థుల విద్యా ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకు అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్లను నిలిపి వేశారన్న ఇటీవలి నివేదికల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులలో పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ చర్య తీసుకున్నారు. చాలా రాష్ట్రాలలో అనుసరిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నమూనా మాదిరిగా, ప్రత్యేక ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి, 11, 12 తరగతులను పాఠశాల విద్య పరిధిలోకి తీసుకు రావాలని తెలంగాణ విద్యా కమిషన్ గతంలో సిఫార్సు చేసింది. పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ఏకీకృతం చేయడం వల్ల విద్యార్థుల డ్రాపౌట్ రేట్లను గణనీయంగా తగ్గించ వచ్చని కమిషన్ పేర్కొంది. ప్రస్తుతం, తెలంగాణలో ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా విధానం కొనసాగుతోంది.