హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కోతలను.. అధిగమించి 24 గంటల కరెంటు ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తాం అని చెప్పారు.తెలంగాణకు 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆరే అని, హైదరాబాద్ 24 గంటలు తాగునీరు ఇచ్చేది కూడా మాజీ సీఎం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసింది ఏమీ లేదన్నారు. పార్టీ పరిపాలన గురించి అవగాహన ఉంది కాబట్టే నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కట్టిన ఫ్లై ఓవర్లు, ఆసుపత్రులు, భవనాలను ఓపెన్ చేస్తూ మేమే చేశామని అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో కేవలం అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెట్టామన్నారు కేటీఆర్.
కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి అండగా ఉన్న కార్యకర్తకు, నాయకుడికి ప్రతి ఒక్కరికి తగిన అవకాశం, గౌరవం కల్పిస్తాం అని ప్రకటించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన పార్టీ కార్యకర్తలకు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇవాళ. కాంగ్రెస్, బిజెపి నమోదు చేసిన దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేటీఆర్. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోత, నీటి కోత తీవ్రంగా ఉండేదని, అయితే పట్టుదలతో 24 గంటల నిరంతర కరెంట్ ను హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి అందించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.