అమరావతి : ఇండియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ పార్టీపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాక్రోచ్ పార్టీ’ అనేది యువత అసహన ఫలితమే తప్ప, రాజకీయ అంశం కాదన్నారు. సీజీపీని కేవలం రాజకీయ కోణం నుండే కాకుండా యువత మనోభావాల నుండి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని యువత తమ ఆశయాలు, ఉపాధి అవకాశాలు, పోటీ పరీక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల గురించి వ్యక్తం చేస్తున్న భావాలను ప్రజాస్వామ్య ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా స్వీకరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ధోరణులను గమనించినట్లు తెలిపారు. యువత ఆశయాలను నెరవేర్చడానికి ప్రభుత్వం అవసరమైన విధాన పరమైన మార్పులు, సవరణలను చేపట్టాలని అన్నారు పల్లా శ్రీనివాస రావు.
యువత తాము మోసపోయామని భావించకుండా, తమ ఆశయాలు నెరవేరాయని సంతృప్తి చెందే విధంగా పాలన సాగించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని ఆయన పేర్కొన్నారు. యువత భవిష్యత్తు , ఆర్థికాభివృద్ధి సహా ఈ అంశాలపై ఎల్లప్పుడూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉపాధి కల్పన, డిజిటల్ ఇండియా, స్టార్టప్లు, తయారీ రంగం, పారిశ్రామిక అభివృద్ధి , అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఆయన నొక్కి చెప్పారు. సోషల్ మీడియా అనేది నియంత్రణకు అందని ఒక వేదికగా మారుతోందని, సరిహద్దు ఆవల నుండి లేదా విదేశాల నుండి ప్రభావం చూపే మాధ్యమంగా కూడా ఇది పరిణమిస్తోందని, కాబట్టి దీనిని విస్మరించ కూడదని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రతి విమర్శనూ దేశ వ్యతిరేక చర్యగా పరిగణించాల్సిన అవసరం లేదని అన్నారు.
