ఏపీలో సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్

సముద్రతీర అభివృద్ధిపై నిపుణులతో సీఎం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరం అభివృద్దికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సముద్ర తీర అభివృద్ధికి సంబంధించి నిపుణులు, అధికారులతో సీఎం సమావేశం అయ్యారు. ఏపీలో ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తి స్థాయి అధ్యయనం నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బ్లూ ఎకానమీలో భాగంగా సముద్ర ఆర్ధిక వ్యవస్థ గురించే చర్చ జరుగుతోందని అన్నారు. .అపారమైన వనరుల్ని వెలికి తీస్తే విస్తృత ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేశామని తెలిపారు. రొయ్యలు, చేపల సాగు, ఎగుమతుల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఆక్వా కల్చర్ లో వాల్యూ అడిషన్ జరగాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీంతో పాటు ఆక్వా వ్యర్ధాలు కాలుష్య కారకంగా మారి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని అన్నారు.

ఈ సవాళ్లను పరిష్కరించేలా పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే మెరైన్ బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సముద్రాలతో పాటు తీరప్రాంతాల్లో దొరికే రేర్ ఎర్త్ మినరల్స్ పై కూడా ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల‌ని.. ఆ వనరుల్ని అందిపుచ్చు కోవాలన్నారు. తీరప్రాంత రక్షణ పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తుపాన్ల లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సముద్ర తీరాల్లో మడ అడవులు, తాటి చెట్లు లాంటి మూడంచెల సహజ రక్షణ కవచం ఏర్పాటు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. పర్యావరణ అనుకూల విధానాలతో పాటు పర్యాటకం, ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా సముద్ర తీరప్రాంతాలు తయారు కావాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. అలాగే సీ వీడ్ అభివృద్ధి, మార్కెటింగ్ లాంటి అంశాలపై కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

Leave A Reply

Your Email Id will not be published!