అమరావతి : ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు. విశాఖ ప్రాధాన్యతను జాతీయ స్థాయిలో రైల్వే జోన్ ప్రాధాన్యతను పెంచుతుందన్నారు. పారిశ్రామిక పురోగతి, ఉపాధి అవకాశాల పెంపుకు జోన్ కీలకంగా మారనుందని పేర్కొన్నారు. సరుకు రవాణా, ప్రయాణికుల సేవలు, మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి.
రైల్వే పరిపాలనా వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం కానుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం నలుదిశలా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కేంద్రంతో సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు కృషితో సాకారమవుతోంది ఉత్తరాంధ్ర ఆకాంక్ష అని పేర్కొన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్తో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారనుందని అన్నారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. ప్రాంతీయ సమతుల అభివృద్ధికి ఈ నిర్ణయం దోహద పడుతుందన్నారు.