కర్ణాటక : గంగా, కావేరీ నదుల అనుసంధానం జరిగితే భారత్ అజేయ శక్తిగా మారుతుందని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గురువారం కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్ట్ కోసం 33 కొత్త క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమత్రి అనుముల రేవంత్ రెడ్డితో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కెన్-బెత్వా ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని నదులను అనుసంధానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గోదావరి , కావేరీ నదుల అనుసంధానం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , తెలంగాణ రాష్ట్రాల అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల తుంగభద్ర , ఆల్మట్టి ప్రాజెక్టులకు తగినంత నీటి ప్రవాహం రావడం లేదని అన్నారు.
ఈ ఏడాది నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. నదుల అనుసంధానం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి అభిప్రాయం ప్రకారం, మొదట రాష్ట్రాల పరిధిలోని నదులను అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నదులతో అనుసంధానం చేపట్టాలని పేర్కొన్నారు. జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రాంత రైతుల సంక్షేమంపై చర్చించారని నాయుడు తెలిపారు. 2024లో తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి 19వ గేటు కొట్టుకు పోయినప్పుడు తాత్కాలికంగా ‘స్టాప్ లాక్ గేటు’ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పుడు 33 కొత్త గేట్లను అమర్చామని ఆయన చెప్పారు. రైతులను ఆదుకునేందుకు తుంగభద్ర డ్యామ్ను పునరుద్ధరించే క్రమంలో మూడు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి కొత్త గేట్లను ఏర్పాటు చేశాయని వెల్లడించారు.
