న్యూఢిల్లీ : ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ లను ఏకి పారేశారు. ఈ రెండూ దేశంలో ప్రజలను కులం పేరుతో, మతం పేరుతో విభజించేందుకు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. దీని కారణంగా ధనిక-పేద అంతరాన్ని పెంచుతున్నాయని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై విద్వేష ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే రాహుల్ గాంధీ తాము ఎవరినీ ద్వేషించమని, ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుంటామని చెప్పారన్నారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ‘రచనాశీల కాంగ్రెస్ జాతీయ సదస్సు’లో ప్రసంగించారు. ఆ రెండు సంస్థలు దేశంలో శాంతికి భంగం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
మొహబ్బత్ కి దుకాన్’ తెరుస్తున్న కాంగ్రెస్, సమాజంలో శాంతి, ఐక్యతను కాపాడాలని కోరుకుంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ చేసిన ప్రతి పనికి పథకాల పేర్లు మార్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒకరోజు ఆయన మన జాతీయ జెండాను కూడా దించేందుకు ప్రయత్నించ వచ్చని భయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం ఏ మేరకు సాకారం చేసిందనే దానిపై ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఇది ఒక అవకాశమని ఆయన అన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్లతో సహా కాంగ్రెస్ ప్రధాన మంత్రులందరూ తమ కాలంలోని సవాళ్లకు అనుగుణంగా భారతదేశాన్ని ముందుకు నడిపించి, భవిష్యత్ భారతదేశానికి పునాది వేశారనేది కాంగ్రెస్ సంప్రదాయమని ఖర్గే అన్నారు.
నేడు యువత కలలు అణచి వేయబడుతున్నాయి. ప్రభుత్వ తప్పుడు విధానాలు వారిని ఎంతటి అంధకారంలోకి నెట్టాయంటే, దేశ వ్యాప్తంగా యువజన ఉద్యమాలు జరుగుతున్నాయి. తాము ఈ యువతకు అండగా నిలబడి వారికి మద్దతు ఇస్తున్నాం. యువతను, పేదలను , అణగారిన వర్గాలను ముందుకు నడిపించడమే మా బాధ్యత అని ఆయన అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం పౌరులకు కల్పించిందని, తమ హక్కుల కోసం వీధుల్లోకి రావడం దేశద్రోహం కాదని ఆయన పేర్కొన్నారు.
