అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా ఆంధ్రా క్రికట్ అసోసియేషన్ , జీఎంఆర్ సంయుక్తంగా నిర్వహించిన ఏపీ ప్రిమీయర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ విజేతగా నిలిచింది భీమవరం బుల్స్ జట్టు. మ్యాచ్ లో భాగంగా జట్టు ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సింహాద్రి వైజాగ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భీమవరం బుల్స్ బ్యాటర్లు దూకుడుగా ఆడి కేవలం 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని నమోదు చేశారు. భీమవరం బుల్స్ విజయానికి రేవంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ తో ప్రధాన బలంగా నిలిచింది. వీరిద్దరూ అతి తక్కువ బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు
. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్తో భీమవరం బుల్స్ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుని ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ఛాంపియన్గా అవతరించింది. మ్యాచ్ అనంతరం విజేతగా నిలిచిన భీమవరం బుల్స్, రన్నరప్గా నిలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లకు ట్రోఫీని మంత్రి నారా లోకేష్ అందజేశారు. టోర్నమెంట్లో ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు, నగదు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు, ఎంపీ మతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.
