కర్నూలు జిల్లా : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భరత్ గుప్తా. ఈ సందర్బంగా అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మంత్రి. తాము ఇచ్చిన మాట ప్రకారం కర్నూలులో ఏపీ గర్వపడేలా హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. కర్నూలులోని ఎర్రబురుజులో పింఛన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.
తమ కూటమి సర్కార్ హయాంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా జిల్లాలోని ఓర్వకల్లుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఇక్కడ మహిళలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు. ఇదే క్రమంలో 175 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం అన్నారు. త్వరలో రూ.300 కోట్లతో ఈ.వి వెహికల్ కంపెనీ రాబోతుందన్నారు.
ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో వాటర్ లైన్ పనులు పూర్తి చేస్తున్నాం అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు జిల్లాకు పరిశ్రమలు తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా ఆరు నూరైనా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా తాము హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
