హైదరాబాద్ : టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నటరత్న కుటుంబం నుంచి అత్యంత జనాదరణ పొందిన నటులలో బాలకృష్ణ తర్వాత తనే. అయితే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న డ్రాగన్ లో నటిస్తున్నాడు. అయితే తను తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి, ఏకంగా 2 ఏళ్ల కాలంలోనే ఎవరూ ఊహించని విధంగా సీఎం అయ్యాడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తొలుత సేవా కార్యక్రమాలతో జనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత పార్టీని పెట్టి సక్సెస్ అయ్యాడు. ఇదే ఫార్ములాతో ఏపీలో పాగా వేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏకంగా రా ఎన్టీఆర్ పేరుతో ఓ వెబ్ సైట్ కూడా ఏర్పాటైంది. సోషల్ మీడియాలో ఇక తెగ హడావుడి కూడా చేసేశారు.
దీంతో ఇందుకు సంబంధించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, తమకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం మంగళవారం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఈనెల 18న ప్రారంభించనున్న ఊరు – వాడ సేవా కార్యక్రమాన్ని ఆసరా చేసుకుని RAW NTR పేరుతో ప్రైవేటు వ్యక్తులు ఒక ఆర్గనైజింగ్ సంస్థ ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఊరు – వాడ కార్యక్రమం పూర్తిగా తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేయడం తగదని పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా వంద కోట్లు ఎన్టీఆర్ ప్రజాసేవకోసం ఖర్చు చేయబోతున్నారని.. రాజకీయ అరంగేట్రం భాగంగా ఇది ప్రారంభిస్తున్నట్లుగా రా-ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది.
రా-ఎన్టీఆర్ కార్యకలాపాలపై ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఎన్టీఆర్ కార్యాలయం. ఆ రా-ఎన్టీఆర్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారికంగా లేఖ విడుదల చేసింది.
