హైదరాబాద్ : నేను కరీంనగర్ జిల్లా వాసిని. 25 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజల నీటి కష్టాలు చూస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ ఈటల రాజేందర్. ఈ పద్ధతి మానుకోవాలని, రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమా ? అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. 2023లో లక్ష్మీ బరాజ్ పిల్లర్లు కుంగి పోయాయని ఆవేదన చెందారు. ఇంజనీర్లు తప్పు డిజైన్ ఇస్తే వారిని, కాంట్రాక్టర్ తప్పు చేస్తే వారిని, పాలకులు అహంకారంతో ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ప్రూవ్ అయితే వారిని శిక్షించాలన్నారు.
తాము ఏ పార్టీకి సపోర్ట్ కాదన్నారు. రైతులకు, ప్రజలకు.. న్యాయానికి, ధర్మానికి సపోర్ట్ గా ఉంటామన్నారు ఈటల రాజేందర్. ఎస్ఆర్ఎస్పి (SRSP) 90 టీఎంసీల ప్రాజెక్ట్, ఎల్ఎండి (LMD) 24 టీఎంసీల ప్రాజెక్ట్.. 24 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి డిజైన్ చేశారు. కానీ ఏనాడూ 10-12 లక్షల ఎకరాలకు మించి నీళ్లు అందలేదు, వరంగల్ దాట లేదన్నారు. బోర్లు వేసి బండబారినవి బండ బ్రతుకులు. నోటికాడికి వచ్చిన బుక్క ఎండి పోయిందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత రెండు పంటలకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశామన్నారు ఎంపీ ఈటల రాజేందర్.
సమైక్యాంధ్రలో కూడా సీఎంలు సంయమనంతో సమాధానం చెప్పారు. కానీ సీఎం ఇలా మాట్లాడడం ప్రజలను కుంగ దీసేలా చేస్తుందన్నారు. ఈరోజు ప్రజలు మాట్లాడక పోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు కర్రుకాల్చి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఎల్ నినో (El Niño) వల్ల భయంకరమైన కరువు వస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వర్షాలు పడితే 28 లక్షల ఎకరాలు పారిందని చెప్తున్నావు, కానీ ఈరోజు విత్తనాలు మొలవడం లేదు. పత్తి విత్తనాలకు బిందెలతో నీళ్లు పోస్తున్నారు. అవి చూసి చలించి.. సీఎం వెంటనే స్పందించి నీళ్లు ఇవ్వండి అని అడుగుతుంటే అనుచిత కామెంట్స్ చేయడం దారుణమన్నారు.
