శ్రీవారి హారతి వివాదం మాజీ సీఎం బొమ్మై ఆగ్రహం
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కామెంట్స్ అర్థరహితం
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల లోని శ్రీవారికి ఇచ్చే తొలి హారతిపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. తిరుమల ఆలయంలోని మొదటి హారతిని కర్ణాటకకు కేటాయించాలని సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సీరియస్ గా స్పందించారు. దేవుని ముందు అందరూ సమానమే అయినప్పుడు, ప్రజాప్రతినిధులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు అందరూ సమానమే అయితే, ఆయన అసలు ఆ వ్యాఖ్యే చేసి ఉండకూడదని పేర్కొన్నారు. ఈ హారతి ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం అని తెలిపారు.
ఇది మైసూర్ మహారాజుకు కేటాయించబడింది. గొప్ప చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఆ ఆలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు మాజీ సీఎం బొమ్మై. ఆనాటి యోధులు శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులుగా ఉంటూ, అనేక ఆభరణాలు , ఇతర వస్తువులను సమర్పించారు. అందుకే, మొదటి హారతిని మైసూర్ మహారాజుకు ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ సంప్రదాయం కర్ణాటక ప్రభుత్వానికి బదిలీ అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఒక ప్రత్యేక అధికారి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించరు కదా… కాబట్టి, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే అధికారి హారతి ఇవ్వడమే సముచితం అన్నారు. డీకే శివకుమార్ అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగనివ్వాలని కోరారు బొమ్మై.
