విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. ఏపీ కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీల పేరుతో నాటకాలు ఆడుతోందన్నారు. విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత తిరిగిచ్చేది పిసరంత మాత్రమేనని పేర్కొన్నారు. బుధవారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కూతలు కూయడం, అనంతరం జనాలకు వాతలు పెట్టడం అలవాటుగా మారిందన్నారు. ఇప్పుడు చిల్లరతో పాచికలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. విద్యుత్ చార్జీల తగ్గింపు ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నది మాయాజాలం తప్పా మరోటి కాదన్నారు .
ట్రూ అప్ కింద భారీగా షాకులు పెట్టి ట్రూ డౌన్ పేరుతో ఆయిట్మెంట్ రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.15485 కోట్ల మేర సర్దుపోటు వేసి, ముష్టి రూ. 923 కోట్లు తగ్గించి , ఉద్ధరించామని గొప్పలు చెప్పడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్. నిజంగా కూటమి ప్రభుత్వానికి కరెంటు ఛార్జీల తగ్గింపుపై చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దమ్ముంటే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికో పది పైసలు, పదమూడు పైసలు కాదు.. వసూలు చేస్తున్న ట్రూ అప్ భారాన్ని మొత్తంగా తగ్గించి తీరాల్సిందేనని పేర్కొన్నారు. రెండేళ్లుగా వసూలు చేసిన అదనపు మొత్తాన్ని వినియోగ దారులకు తిరిగి చెల్లించాలని కోరారు. ఎన్నికల్లో 30 శాతం మేర చార్జీల తగ్గింపు హామీని వెంటనే అమలు చేయాలన్నారు.