అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికంటే ముందే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎయిర్ పోర్టును ప్రారంభించేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నారు. అందుకే ఢిల్లీలో పర్యటిస్తున్నట్లు తెలిపారు సీఎం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ గా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేశాం అన్నారు . ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి. ప్రతి పౌరుడ్నీ భాగస్వామిని చేయాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రకు మణిహారంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుందన్నారు. ఆగస్టు 1వ తేదీన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ప్రకటించారు. ఎయిర్ పోర్టు పాసింజర్ టెర్మినల్ , ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఎడ్యుసిటీలను ప్రారంభించు కోబోతున్నాం అని తెలిపారు సీఎం. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించు కోవాలని అన్నారు .
అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏపీకి ఓ లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఓ గేమ్ చేంజర్. ఎయిర్ పోర్టుతో పాటు ఏఐ డేటా సెంటర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి ఖనిజాలు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మారుస్తాయని అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టేకాఫ్ అయితే ఉత్తరాంధ్రతో పాటు యావత్ రాష్ట్రానికి కీలక ప్రాజెక్టుగా మారుతుందన్నారు.
ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులను, యజమానుల్ని గౌరవిస్తూ ఒకమారు ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నాం అని ప్రకటించారు సీఎం.
