క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమ ప్రదేశం

సీఎం చంద్రబాబుతో క్వాంటినమ్ టెక్నాలజీస్ సీఈఓ

అమరావతి : క్వాంటం కంప్యూటింగ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్ టెక్నాలజీగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని గుర్తించి అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పని చేయటం ప్రారంభిస్తుందని తెలిపారు. ఇప్పటికే క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీలు ఏపీలో పని ప్రారంభించాయని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ఫుల్ స్టాక్ క్వాంటం కంప్యూటింగ్ కంపెనీ క్వాంటినమ్ సంస్థ సీఈఓ రాజీబ్ హజ్రా సహా ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

అమరావతి క్వాంటం వ్యాలీని క్వాంటం ఇన్నోవేషన్ సహా పరిశోధనలు తదితర అంశాల్లో కీలకమైన హబ్ గా తయారు చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్వాంటినమ్ సంస్థ సీఈఓ చర్చించారు. జాతీయ క్వాంటం మిషన్ కు అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎకోసిస్టంను అభివృద్ధి చేసేందుకు ఏపీతో భాగస్వామ్యం కుదుర్చు కునేందుకు క్వాంటినమ్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. క్వాంటం నైపుణ్యాలు, ఏఐ ఎనెబుల్డ్ క్వాంటం అప్లికేషన్లు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీసెర్చి, స్టార్టప్ ఇంక్యుబేషన్ టెక్నాలజీల పై పని చేయాలని సీఎం సూచించారు. గతంలో ఐటీని ప్రోత్సహించామని ఇప్పుడు ఏఐ, క్వాంటం టెక్నాలజీల ద్వారా వేగంగా సమస్యలకు పరిష్కారం అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

క్వాంటం పరిశోధనలకు ఏపీ అమరావతి అత్యుత్తమ ప్రాంతమని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలో క్వాంటం కంప్యూటర్ పరికరాల ఉత్పత్తితో పాటు అల్గారిథమ్స్ వరకూ సహకారం అందించేందుకు తాము సిద్ధమని క్వాంటినమ్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సీతారామకృష్ణ, అమరావతి క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!