పోలవరం జిల్లా : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతిబిడ్డకు ఆర్థిక సాయం అందుతుండటంతో తమకు విద్యా ఖర్చుల భారం గణనీయంగా తగ్గిందని గిరిజన మహిళలు అన్నారు. ఈ పథకం తమ పిల్లల చదువుకు ఎంతో అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం పోలవరం జిల్లా రంపచోడవరంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రికి ఆదివాసీ మహిళలు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సరస్వతి దేవికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయని తెలిపారు. పాఠశాలల్లో మంచి విద్యా వాతావరణం నెలకొల్పడంతో పాటు పరిశుభ్రమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని వివరించారు. అదే విధంగా తమకు స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల పట్టణాలకు వెళ్లి చిరు వ్యాపారాలు చేసుకోవడం సులభమైందని, ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు దోహద పడుతోందని గిరిజన మహిళలు తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది విజ్ఞప్తితో వారికీ తల్లికి వందనం అమలు చేస్తున్నామని సీఎంకు మంత్రి లోకేష్ వివరించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గిరిజన మహిళలతో కలిసి ఆత్మీయంగా సెల్ఫీ దిగారు.
