అమరావతి : ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది ఇవాళ. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం జీవో కూడా జీవో జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. కోటయ్య రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం బాపట్ల జిల్లాలోని చీరాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ప్రగడ కోటయ్య విశేష సేవలు అందించారు. స్వాతంత్రం రాక ముందు, వచ్చిన తరవాత కూడా రాష్ట్రంలో చేనేత రంగ పటిష్టతకు ఆయన అలుపెరగని కృషి చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడి పనిచేసిన ప్రగడ కోటయ్య ఆనాటి చేనేత కార్మికుల కష్టాలను చట్టసభల్లో వినిపించారు. 1952లో తొలిసారిగా మద్రాసు శాసనసభకు ఎంపికై, చీరలు, దోవతులు, చేనేత మగ్గాలపై ఉత్పత్తి చేయాలని ఆనాటి శాసనసభలో తీర్మానం చేయించారు. ఇదే అంశంపై ఆనాటి హైదరాబాద్, ముంబయి, బీహార్ శాసనసభలోనూ చేనేత ఉత్పత్తుల తయారీపై తీర్మానాలను ఆమోదించడం విశేషం.
చీరాల సహకార న్నింగ్ మిల్లు శంకుస్థాపనను ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూతో కోటయ్య చేయించారు. 200కు పైగా చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేయించారు. ప్రగడ కోటయ్య కేవలం చేనేత రంగ సమస్యలపైనే కాకుండా రైతుల కోసం, పేదల కోసం కూడా పోరాడారు. చీరాలలో 17 వేల ఎకరాలకు పైగా బంజరు భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. చేనేత రంగానికి, నేతన్నల అభ్యున్నతికి తన జీవితాన్ని ధారబోసిన ప్రగడ కోటయ్య సేవా స్ఫూర్తి గురించి భావి తరాలకు తెలియ జేయలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చీరాలలో జరిగే ప్రగడ కోటయ్య రాష్ట్ర స్థాయి జయంతి కార్యక్రమానికి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ముఖ్య అతిథి పాల్గొననున్నారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
