దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న మోదీ, అమిత్ షా
నిప్పులు చెరిగిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : అమేథి ఎంపీ, లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలను ఏకి పారేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన యువతపై పోలీసులను ఉసిగొల్పింది మీరు కాదా అని లోక్ సభ సాక్షిగా ప్రశ్నించారు. దేశ భవిష్యత్తు పట్ల వ్యవహరించే తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. విద్యార్థి నిరసనకారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం , వారి సోషల్ మీడియా ఖాతాలను తొలగించడం వెనుక మోదీ, షా ఉన్నారని ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారు. మీరు జెన్-జెడ్ను బెదిరించి నోరు మూయించ లేరన్నారు. మొదట మీరు వారి ఎముకలు విరిచారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు . ఆపై వారి ఖాతాలను తొలగిస్తున్నారు..ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
పరీక్షా పత్రాల లీకేజీ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం, రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకు రావడం అవసరమని, పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే ముఠాల పట్ల ఎటువంటి కనికరం చూపబోమని మోదీ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రధానికి తగదన్నారు. ఈ పిల్లలు కూడా భారతీయులేనని ఆ విషయాన్ని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇంకెంత కాలం అబద్దాలను ప్రచారం చేస్తూ బతుకుతారని, పాలన సాగిస్తారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు నీట్ యుజి పేపర్ లీక్ విషయంలో తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారని ఆరోపించారు. కేవలం కొందరినే అరెస్ట్ చేశారని, అసలైన దొంగలను పట్టించు కోలేదని, దీని వెనుక ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి ఉన్నారంటూ నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఎల్లకాలం అధికారంలో ఉండాలని అనుకుంటున్న మోదీకి జెన్ జి యువత చుక్కలు చూపించడం ఖాయమని జోష్యం చెప్పారు.
