ప్రజా వేదిక కుచించుకు పోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం
తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
హైదరాబాద్ : ఈ దేశం ఎటు పోతోంది..? రాను రాను ప్రజాస్వామ్యం అన్నది మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్. ఆయన లేవదీసిన ప్రశ్నలు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. నేరం వ్యవస్థీకృతమై , అన్యాయం అధికారాన్ని గుప్పిట బిగించి ఊరేగుతున్న ఈ ప్రస్తుత తరుణంలో జస్టిస్ ఆందోళన పడటంలో విడ్డూరం ఏముంది..? ఇవాళ కొనసాగుతున్నది ప్రత్యక్షంగా కోట్లాది ప్రజలు చూస్తున్నదే. అనుభవిస్తున్నదే. చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్న తనే ఆవేదన చెందితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి..? ప్రస్తుత న్యాయ వ్యవస్థ, సమాజం, భారత దేశం , ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు , దాడుల పరంపర..ఇలా ప్రతీ అంశం పట్ల లేవదీసిన విధానం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జస్టిస్ ఒక విధంగా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అంతకంటే ఎక్కువగా పలు ప్రశ్నలను మన ముందు ఉంచారు. మనల్ని మార్కెట్ మాయాజాలం ముంచేసిన ఈ తరుణంలో జస్టిస్ ముందస్తుగా హెచ్చరిక చేయడం ఒకింత మేలే జరిగింది. ప్రధానంగా జస్టిస్ లేవదీసింది భారత దేశం గురించి. అసమ్మతి అనేది నేరం కాదు. అది రాజ్యాంగ బద్దంగా వచ్చిన హక్కు. నిరసన లేదా ఆందోళన, అసమ్మతి ని వ్యక్తం చేయడం అనేది సర్వ సాధారణమైన విషయం. అంందుకే జస్టిస్ వాపోయింది అసమ్మతికి ప్రజా వేదిక కుంచించుకు పోతోంది అని. నిరసనలు చేసినందుకు విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు జస్టిస్ ఉజ్జల్ భూయాన్. తన మాటలు భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశం వంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించాల్సిన అవసరంపై రాజ్యాంగ పరమైన చర్చను రేకెత్తించాయి. అనేక ప్రజా నిరసనలపై క్రిమినల్ అభియోగాలు మోపబడుతున్న సమాజంలో, ఈ ప్రకటనలు రాజ్యాంగ ఆదర్శాలను నిలబెట్టడంలో న్యాయవ్యవస్థ పాత్రను ప్రముఖంగా చూపిస్తున్నాయి.
రాజ్యాంగంలో అసమ్మతిని ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైన అంశంగా పరిగణిస్తారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఆర్టికల్ 19(1)(ఎ) , ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కును 19(1)(బి) హామీ ఇస్తున్నాయి. ఈ హక్కులలో విద్యార్థులతో సహా పౌరులు ప్రభుత్వ విధానాలను సవాలు చేయడం, జవాబుదారీగా ఉంచడం, ప్రజా చర్చలో పాల్గొనడం వంటివి ఉన్నాయి. ప్రజా శాంతిభద్రతలు, రాష్ట్ర సార్వ భౌమత్వం, భద్రత పేరిట, పైన పేర్కొన్న రెండు ప్రకరణలు సహేతుకమైన ఆంక్షలను అనుమతిస్తాయి, అయితే ఈ ఆంక్షలు ప్రాథమిక స్వేచ్ఛల సారాన్ని నాశనం చేసే విధంగా ఉండ కూడదు. గతంలో భారతదేశ ప్రజాస్వామ్య పోరాటంలో విద్యార్థులు మార్పునకు చోదక శక్తిగా ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమం నుండి జేపీ ఉద్యమం, ఇతర సామాజిక న్యాయ ఉద్యమాల వరకు, ప్రజా విధానాల అభివృద్ధికి రాజ్యాంగ ప్రక్రియకు విద్యార్థులు దోహదపడ్డారు. అందువల్ల శాంతియుత విద్యార్థి నిరసనలను నేరంగా పరిగణించడం అనేది, రాజ్యాంగం హామీ ఇచ్చిన భాగస్వామ్య ప్రజాస్వామ్య హక్కుపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తుంది. శాంతియుత నిరసన అనేది సుప్రీంకోర్టులో నిరంతరం చర్చనీయాంశంగా వస్తూ ఉన్నది.
మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో శాంతియుత నిరసన తెలిపే హక్కును ఒక రాజ్యాంగ హక్కుగా కోర్టు నిర్వచించింది . అదే సమయంలో నిరసనకారుల హక్కులను ఇతరుల హక్కులతో సమతుల్యం చేయవలసిన అవసరం ఉందని పేర్కొంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని, అయితే ఇతర పౌరుల హక్కులను ఉల్లంఘించకుండా ప్రజా వేదికను సాధ్యమైనంత కాలం ఆక్రమించు కోలేమని కోర్టు నొక్కి చెప్పింది. ప్రజా శాంతి భద్రతల పరిరక్షణను, రాజ్యాంగ స్వేచ్ఛల పరిరక్షణను న్యాయవ్యవస్థ ఎలా సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుందో, కానీ భిన్నాభిప్రాయాన్ని పూర్తిగా తొలగించడానికి కాదని చెప్పడానికి ఈ తీర్పులు ఒక ఉదాహరణ.
న్యాయమూర్తి భూయాన్ చేసిన వ్యాఖ్యలు, కేదార్ నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ (1962) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ తీర్పులో, హింస లేదా అల్లర్లకు దారితీయనంత వరకు ప్రభుత్వ విమర్శ రాజద్రోహం కిందకు రాదని స్పష్టం చేసింది. ఇటీవలి మరో కేసు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2015)లో, ప్రజాదరణ లేని లేదా విమర్శనాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని చట్టవిరుద్ధం చేయలేమని పేర్కొంటూ, కోర్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఒక సెక్షన్ను మరోసారి కొట్టివేసింది. ఈ తీర్పులన్నీ కలిసి, ప్రభుత్వంతో విభేదించడం చట్టవిరుద్ధం కాదనే రాజ్యాంగ సూత్రాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి . విద్యార్థి నిరసనకారులపై నివారణ నిర్బంధ చట్టాలు, క్రిమినల్ అభియోగాలు మరియు పోలీసు చర్యలను ఎక్కువగా ఉపయోగించడం పౌర సమాజం, రాజ్యాంగ నిపుణుల విమర్శలను ఆకర్షించింది. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన ప్రయోజనం ఉంది, కానీ శాంతియుత ప్రదర్శనకారులపై విచక్షణారహితంగా క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఈ పద్ధతులు ప్రజలను ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి విముఖంగా మార్చవచ్చు అని కూడా హెచ్చరించింది.
ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సంభాషణ, విమర్శ , శాంతియుత విభేదాల ద్వారా వర్గీకరించ బడుతుందని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యలు మనకు గుర్తు చేయడానికి సరిగ్గా సరిపోతాయి. విశ్వ విద్యాలయం అనేది ఆలోచనలకు, రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటూ వచ్చింది. రాజ్యాంగ పరిమితుల్లో ఉంటూ అసమ్మతిని వ్యక్తం చేసినందుకు విద్యార్థులు నేర శిక్షకు భయపడకూడదు. ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య రాజ్యం శాంతియుత నిరసన , చట్టవిరుద్ధమైన హింస మధ్య తేడాను గుర్తించాల్సి ఉంది. భారతదేశం సంక్లిష్టమైన రాజకీయ, సామాజిక సమస్యలతో పోరాడుతున్న ఈ యుగంలో, అసమ్మతి తెలిపే హక్కు అత్యవసరం కూడా. విమర్శలను తట్టుకుని, విభిన్న స్వరాలను అంగీకరించగల సామర్థ్యం కంటే గొప్ప ప్రజాస్వామ్య చిహ్నం మరొకటి లేదు. శాంతియుత అసమ్మతి హక్కు కేవలం రాజ్యాంగ ఆవశ్యకత మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అని, చట్టబద్ధమైన పాలనను నిలబెట్టడానికి దాని మూలస్తంభం అని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యలు మరోసారి నొక్కి చెబుతున్నాయి.
