యువతను తప్పుదోవ పట్టించకండి : కంగ‌నా ర‌నౌత్

త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్ పై ప‌ట్టించుకోనంటూ ఫైర్

న్యూఢిల్లీ : వివాదాస్ప‌ద న‌టి, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ కంగ‌నా రనౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన సినిమా క్లిప్‌లను వాడుతూ ట్రోల్ చేస్తున్నవారిపై సీరియ‌స్ గా స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, చాలా మంది నెటిజన్లు త‌న‌ సినిమాలలోని , ఇతర కార్యక్రమాలలోని క్లిప్‌లను షేర్ చేస్తూ విమర్శిస్తున్నారు. తన సినిమాలలోని క్లిప్‌లను తనకు వ్యతిరేకంగా వాడుకుంటున్న నెటిజన్లపై నటి ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇలాంటి చర్యలు యువతను తప్పుదోవ పట్టిస్తాయని కంగ‌నా ర‌నౌత్ పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా నిరసనల్లో పాల్గొన్న వారిపై త‌ను చేసిన వ్యాఖ్యల కారణంగా గత కొన్ని రోజులుగా ఆమె వార్తల్లో నిలిచారు. ఆ వ్యాఖ్యలలో ఆమె ‘జెన్-జెడ్’ తరాన్ని జనరేషన్ గట్టర్ (మురికి తరం) అని, వారి నిరసన వీడియోలను వాంతులు వచ్చేలా ఉన్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

.దీనికి ప్రతిస్పందనగా చాలా మంది నెటిజన్లు కంగ‌నా ర‌నౌత్ సినిమాలలోని , ఇతర కార్యక్రమాలలోని క్లిప్‌లను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున షేర్ చేయ‌డం, విమ‌ర్శ‌లు చేస్తూ వస్తున్నారు. రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియో క్లిప్‌తో పాటు ఒక సందేశాన్ని పంచుకున్నారు. నేను భారీ పారితోషికం తీసుకుని పోషించిన సినిమా పాత్రల క్లిప్‌లను, లేదా నా సొంత సిబ్బంది, ఈవెంట్ ప్లానర్లు, భద్రతా సిబ్బంది మధ్య నేను పాల్గొన్న హై-ప్రొఫైల్ షో-బిజినెస్ కార్యక్రమాల క్లిప్‌లను మీరు వాడుకోవాలని అనుకుంటున్నారు. వీటిని ఉపయోగించి, సున్నితమైన మనస్తత్వం కలిగిన టీనేజర్లు రోడ్ల మీద లేదా పాఠశాల కార్యక్రమాల్లో లేదా చీకటి క్లబ్‌లలో కూడా అలాగే ప్రవర్తించవచ్చని నమ్మించాలని అనుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ద‌య‌చేసి యువతను తప్పుదోవ పట్టించకండి, రెండూ ఒకటే కాదు. ఈ రోజు మీరు ఇతరుల పిల్లలను తప్పుదోవ పట్టిస్తే, రేపు మీ పిల్లల వంతు రావచ్చు అని ఆమె జోడించారు.

Leave A Reply

Your Email Id will not be published!