అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ, డీఏ బకాయిలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కావాలని అనుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుతో సహా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల దీర్ఘకాలిక డిమాండ్లపై శనివారం సమావేశం అయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కు అనుబంధంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పీఆర్సీ నియామకం, సంబంధిత బకాయిలు, కరువు భత్యం బకాయిల చెల్లింపుపై చర్చలు ప్రధానంగా జరిగాయి. పెండింగ్లో ఉన్న హామీల అమలుకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు, వాటి అమలుకు అవసరమైన చర్యల గురించి అధికారులు సీఎంకు వివరించారు. మరోవైపు, తమ దీర్ఘకాలిక ఆర్థిక , ఆర్థికేతర డిమాండ్లపై చర్చలకు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించడం పట్ల ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ జేఏసీ స్వాగతించింది.
దీనిని తమ పోరాటంలో మొదటి విజయంగా అభివర్ణించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈ పోరాటానికి ఐక్య మద్దతు తెలిపారని జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పాలీశెట్టి దామోదర రావు, అసోసియేట్ చైర్మన్ టి.వి. ఫణిపెర్రాజు, కోశాధికారి తిమ్మిసార్తి నాగేశ్వర రావు, మహిళా విభాగం చైర్పర్సన్ పి. లక్ష్మి , ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రకటించిన విధంగానే “డిమాండ్ల దినం” నిరసనలు చేపట్టారు. అన్ని జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించారు. తమ ఆర్థిక డిమాండ్ల పరిష్కారమే ఉద్యోగుల ప్రధాన ఆకాంక్ష అని జేఏసీ తెలిపింది. తక్కువ కాల పరిమితితో వేతన సవరణ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయడం, జాప్యం దృష్ట్యా మధ్యంతర భృతి కల్పించడం, పెండింగ్లో ఉన్న కరువు భత్యాలను విడుదల చేయడం, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అదనపు పెన్షన్ను పునరుద్ధరించాలని కోరింది.
