బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీ చీఫ్ విజయేంద్ర . రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ తరుణంలో భరోసా ఇవ్వాల్సిన సీఎం బాధ్యతా రాహిత్యంగా రైతులతో నేరుగా మాట్లాడకుండా కేవలం హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తే ఎలా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ ను ఉద్దేశంచి హెలికాప్టర్ ద్వారా కరువును పరిశీలించిన ఏకైక మహానుభావుడు అంటూ విజయేంద్ర ఘాటుగా విమర్శించారు. రైతులు తమ సమస్యల గురించి ప్రశ్నిస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి పొలాల వద్దకు వెళ్లడం లేదని విజయేంద్ర ఎద్దేవా చేశారు. రైతుల ఆందోళనలను ఆయన ఎలా అర్థం చేసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాలిలోంచి పొలాలను చూస్తూ వరిని, రాగిని కూడా ఆయన గుర్తించగలరా అని ఎద్దేవా చేశారు. కొప్పళ జిల్లాలోని కరటగిలో జరుగుతున్న బీజేపీ పాదయాత్రలో నాలుగో రోజు ప్రసంగించారు విజయేంద్ర . పంట నష్టాలతో రైతులు సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి వైమానిక సర్వే కాకుండా క్షేత్రస్థాయిలో పొలాలను సందర్శించి ఉండాల్సిందని అన్నారు. ఒకవేళ ఆయన పొలాలకు వెళ్తే, రైతులను , వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ముఖ్యమంత్రిని కలిగి ఉండటం మన దురదృష్టం. హెలికాప్టర్లో కూర్చుని కిందకు చూస్తే, ఏది వరి పంటో, ఏది రాగి పంటో ఆయనకు ఎలా తెలుస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, వారి పెరుగుతున్న కష్టాలపై స్పందించడంలో విఫలమవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఈ పాదయాత్రను చేపట్టిందని ఆయన చెప్పారు.
గత మూడేళ్లలో రాష్ట్రంలో 3,600 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో సుమారు 950 మంది కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందినవారే ఉన్నారని పేర్కొన్నారు విజయేంద్ర. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతుల సమస్యలపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా, వారిని నిస్సహాయ స్థితిలో వదిలేసింది అని ఆయన అన్నారు. రెండో పంటకు నీటి లభ్యత విషయంలో కూడా విజయేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
