చెన్నై : వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొలువు తీరిన డీఎంకే పార్టీ ఎలా మిత్రపక్షాలను అవమానించారనే దానిపై నోరు విప్పారు. నిప్పులు చెరిగారు ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను. తమను బయటకు వెళ్లేలా చేశారని ఆరోపించారు. మిత్రపక్షాలతో సత్సంబంధాలను, స్నేహాన్ని కాపాడుకునే సామర్థ్యం డీఎంకేకి లేక పోవడం వల్లే ఆ పార్టీలు కూటమి నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కూటమిని వీడి టీవీకే కూటమిలో చేరడంపై డీఎంకే చేస్తున్న నిరంతర విమర్శలను తీవ్రంగా తప్పు పట్టారు. తిరుమాళవళన్ తో పాటు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి దురై వైకో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల పంపకాల చర్చల సమయంలో డీఎంకే వ్యవహరించిన తీరు వల్లే కూటమి విచ్ఛిన్నమైందని వారు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి చాలా కాలంగా తనను ‘సోఫావళవన్’ (సోఫాకే పరిమితమైన వ్యక్తి) అని పరోక్షంగా విమర్శిస్తుండటంపై తిరుమావళవన్ స్పందించారు.
అనేక అంశాలపై బీజేపీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీతో దీర్ఘకాలం పొత్తులో ఉన్న డీఎండీకేకి డీఎంకే పది సీట్లు ఎలా కేటాయించిందనే దానిపై ప్రశ్నించారు. కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీధి మయ్యం’కు ఒక్క సీటు కూడా ఇవ్వకపోగా ఎండీఎంకేకు మాత్రం కేవలం నాలుగు సీట్లతో సరిపెట్టి, పైగా డీఎంకే గుర్తుపైనే పోటీ చేయాలని ఎందుకు ఒత్తిడి చేశారని ఆయన నిలదీశారు. పుదుక్కోట్టైలో జరిగిన సమావేశంలో తిరుమావళవన్ అభిప్రాయాలను సమర్థించారు దురై వైకో . కట్టుమన్నార్ కోయిల్లో పోటీ చేయవద్తని తనపై ఒత్తిడి తీసుకు వచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. డీఎంకే పార్టీ ఎండీఎంకే, వీసీకే, కాంగ్రెస్, వామపక్ష పార్టీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కూడా జోక్యం చేసుకుందన్నారు.
