అభిషేక్ శర్మ సెంచరీ సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ
47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం
హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్ రైజర్స్ టీం దుమ్ము రేపుతోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకు పోతోంది. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ను 47 పరుగుల తేడాతో ఓడించింది. విచిత్రం ఏమిటంటే ఎస్ ఆర్ హెచ్ స్కిప్పర్ వరుసగా ఏడోసారి టాస్ ఓడి పోవడం. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కు కిక్కు తెప్పించేలా ఆడారు హైదరాబాద్ ఆటగాళ్లు. ముందుగా మైదానంలోకి దిగిన ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు పవర్ ప్లే లో రన్స్ సాధించారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఓవర్ కు 9 పరుగుల కు పైగా చేశారు.
అభిషేక్ శర్మ 68 బంతులు ఎదుర్కొని 138 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు 10 సిక్సులు ఉన్నాయి. క్లాసెన్ 13 బంతుల్లో 37 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ 26 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి. దీంతో 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 242 రన్స్ చేసింది హైదరాబాద్ జట్టు. అనంతరం మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 రన్స్ చేసింది. నితీశ్ రాణా 57 పరుగులు చేయగా సమీర్ రిజ్వీ 41 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 37 చేసినా ఆశించిన మేర వర్కవుట్ కాలేదు. ఇషాన్ మలింగ చెలరేగాడు. తను 32 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
