శ్రీవాణి టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై ఆరోపణలు అబద్దం
సత్యదూరమని ఖండించిన ఈవో ముద్దాడ రవిచంద్ర
తిరుమల : భక్తులకు టీటీడీ వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా శ్రీవాణి ఆన్ లైన్ విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు ఈవో ముద్దాడ రవిచంద్ర. టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో మొదలుపెట్టిన ఆన్ లైన్ శ్రీవాణి టికెట్ విధానాన్నే కొనసాగించడం జరుగుతోందని తెలిపారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆఫ్ లైన్ ద్వారా తిరుమలలో ఏరోజుకారోజు జారీ చేసే విధానాన్ని మార్పు చేయడం జరిగిందన్నారు. మార్పు చేసిన ఈ విధానంలో ముందు ఎవరైతే సాప్ట్ వేర్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తారో వారికే టికెట్ వచ్చే విధంగా సాఫ్ట్ వేర్ తయారు చేసినట్లు వెల్లడించారు ఈవో. రోజ వేల సంఖ్యలో టికెట్లు పొందేందుకు భక్తులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల మొదటి ఒకటిన్నర నిమిషంలోపే ముందు వచ్చిన వారికి ముందు ఇచ్చే విధానంలో లాక్ చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. తదుపరి పేమెంట్ గేట్ వే లో విజయవంతంగా డబ్బులు చెల్లించిన వారికి టికెట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏదైనా కారణం వల్ల డబ్బులు చెల్లింపులు జరగని ఎడల అట్టి టికెట్లను తిరిగి పూల్లోకి తీసుకు రావడం జరుగుతోందన్నారు ఈవో. ఈ ప్రకియ ఐఆర్సీటీసీ , ప్రభుత్వ ఇతర అడ్వాన్స్ బుకింగ్ సర్వీసుల్లో ప్రవేశ పెట్టామన్నారు. ఈ విధానంలో మానవ ప్రమేయం అంటూ ఏమీ ఉండదన్నారు. సిస్టమ్ ఆటోమేటిక్ గా పని చేస్తుందన్నారు ముద్దాడ రవిచంద్ర. పది నిమిషాల తర్వాత టకెట్లు జారీ చేయడం వాస్తవమేనని పేర్కొన్నారు ఈవో. ఎందుకంటే పేమెంట్ గేట్ వే వద్ద చెల్లింపు సమయంలో సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల చేత టీటీడీకి డబ్బు జమ అయినట్లు మెసేజ్ రాకుంటే అలాంటి టికెట్లను తిరిగి పూల్ లోకి తీసుకొచ్చి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేశామన్నారు.