అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం శాసన సభ వేదికగా ఆయన ప్రసంగించారు. సాగు నీటి రంగంపై ప్రసంగించారు. సాగు నీటి రంగానికి సంబంధించి మిగిలి పోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2047 విజన్ లో భాగంగా నీటి భద్రతపైనే కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత తమ ప్రభుత్వానికే వచ్చిందని చెప్పారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరుగా భావిస్తున్నాం అన్నారు. గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. గంగా-కావేరీ అనుసంధానం జరగాలన్నది నా ప్రగాఢమైన ఆకాంక్ష అని తెలిపారు. గంగా-కావేరి అనుసంధానం సాధ్యా సాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయని చెప్పారు. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం స్పష్టం చేశారు సీఎం. హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల మేర కాలువల విస్తరించి కుప్పంలో పరమ సముద్రం చెరువు వరకూ నీరిచ్చామన్నారు. మడకశిర వరకూ నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంత దాహార్తిని తీర్చామన్నారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ, కూటమి హయాంలో వచ్చినవేనని చెప్పారు చంద్రబాబు నాయుడు.
