గల్ఫ్ ఉద్రిక్తతల దృష్ట్యా ఆరా తీసిన అయ్యన్నపాత్రుడు
తెలుగు వారి యోగక్షేమాలు తెలుసుకున్న స్పీకర్
అమరావతి : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 50 వేల మంది వరకు అక్కడ వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారు అనేకమంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్లో స్థిరపడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నాతవరంకు చెందిన ఎన్నారై శెట్టి సతీష్కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా ఫోన్ చేశారు. అక్కడి తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
బహ్రెయిన్లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్పీకర్ . స్థానిక ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకోవాలని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎటువంటి ఆపద వచ్చినా ఏపీఎన్ఆర్టీ (APNRT) ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన భరోసా కల్పించారు. అలాగే, అవసరమైతే అక్కడి తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో తమ బాగోగులు తెలుసుకుని, అండగా నిలుస్తూ తమలో మనోధైర్యాన్ని నింపిన స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి ఎన్నారైలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
