అనంతపురం జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టారు. ప్రజలు అన్నీ గనమిస్తున్నారని హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో యాత్రకు అనంతపురం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఇవాళ మూడోరోజుకు చేరుకుంది యాత్ర. మన్రేగా పరిరక్షణ యాత్రలో భాగంగా సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) పునరుద్ధరించాలని ఏపీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. వీబీ గ్రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. గ్రామ్ జి చట్టం పేదల పొట్ట కొట్టే చట్టమని, 125 రోజులు పని కల్పిస్తామని చెప్పే కేంద్రం మాటలు పచ్చి బూటకమని ఆరోపించారు షర్మిలా రెడ్డి. తాము చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అడుగడుగునా ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కొత్తచెరువు మండల ప్రజల నుంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్. రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ ప్రజల సమస్యలను పట్టించు కోవడం లేదని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, కేవలం ప్రచారం తప్పా చేసింది ఏమీ లేదన్నారు.
