దేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయం

మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కామెంట్స్

తాడేపల్లి గూడెం : మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించు కునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందని ఇన్నాళ్లూ సీఎం, డిప్యూటీ సీఎం చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రతిష్టాత్మక ల్యాబ్‌లు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ తేల్చి చెప్పాయ‌న్నారు. అంతే కాకుండా అదే విషయాన్ని సుప్రీంకోర్డు నియమించిన సిట్‌ కూడా తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడంతో, దిక్కు తోచని ప్రభుత్వం మళ్లీ విచారణకు సిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తప్పు అని అన్నారు.

క్యాబినెట్‌ భేటీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేస్తారని, నిరుద్యోగ భృతి చెల్లిస్తారని, రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తారని, పంట నష్టం పరిహారం ప్రకటిస్తారని ఎదురు చూశారని అన్నారు. కానీ కేబినెట్‌ సమావేశం మొత్తం తిరుమల లడ్డూ అంశాన్ని సమర్థించు కోవడానికే ఉపయోగించినట్టు కనిపిస్తోందని అన్నారు. అందుకే నలుగురు మంత్రులను మీడియా ముందుకు పంపి లడ్డూపై చేసిన ఆరోపణలను సమర్థించే ప్రయత్నం చేశార‌ని ఆరోపించారు.

వైయస్సార్‌సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుడి పేరుతో అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్. కూటమి ప్రభుత్వం లడ్డూ అంశంపై ఎన్ని కమిటీలు వేసినా మాకు భయం లేదని అన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 2014 నుంచి అన్ని అంశాలపై విచారణ జరపాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన లారీల గురించి టీటీడీ ఈవోనే వివరించారని తెలిపారు. అయితే ఆ విషయాల్లో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అనిల్‌ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈఓగా నియమించమని ఎవరు ఒత్తిడి చేశారని ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!