Opposition Meet : జూన్ 12న పాట్నాలో విపక్షాల సమావేశం
బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమి దిశగా
Opposition Meet : భారత దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆక్టోపస్ కంటే వేగంగా విస్తరించిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ నడుం బిగించాయి. ఈ మేరకు కీలక పాత్ర పోషిస్తున్నారు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయన ఇప్పటికే పలువురు కీలకమైన నాయకులను కలుసుకున్నారు. వారిలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు శివసేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ములాఖత్ అయ్యారు.
అంతకు ముందు నితీశ్ కుమార్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాకుండా కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దిగ్గజ నేతలంతా ఆసీనులయ్యారు. తాజా మరో కీలక ప్రకటన చేశాయి విపక్షాలు. వచ్చే నెల జూన్ 12న బీహార్ రాజధాని పాట్నాలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై సమావేశం కావాలని నిర్ణయించాయి(Opposition Meet).
ఇప్పటికే ప్రధాన మంత్రి ప్రారంభించిన నూతన పార్లమెంట్ భవనాన్ని 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా పీఎం వ్యవహరిస్తున్నాడని, రాష్ట్రపతి ఉన్నా ఎందుకు ప్రారంభించ లేదంటూ ప్రశ్నించాయి. ఇదిలా ఉండగా 18కి పైగా భావ సారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ కీలక సమావేశానికి హాజరు కున్నాయి. ఇది సన్నాహక సమావేశం మాత్రమేనని సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు.
Also Read : Yashasvi Jaiswal
