న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమెథీ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్రంలోని బీజేపీని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని గంప గుత్తగా ఫైర్ అయ్యారు. బీజేపీ ఈసీ ఫెవికాలల్ బంధమని, రెండూ దొంగల బజారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సంఘానికి, బీజేపీకి మధ్య కుమ్మక్కు అయ్యాయని ఆయన మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనోజ్ కుమార్ అగర్వాల్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల స్పందించారు.
బీజేపీ-ఈసీ ‘దొంగల బజారు’లో – దొంగతనం ఎంత పెద్దదైతే, ప్రతిఫలం అంత పెద్దదిగా ఉంటుందన్నారు రాహుల్ గాంధీ. పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ హోం , కొండ ప్రాంతాల వ్యవహారాల (ఎన్నికల) శాఖకు పదవీరీత్యా అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మనోజ్ కుమార్ అగర్వాల్ (AS (WB:1990))ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గవర్నర్ నియమించడం దారుణమన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆదేశాల మేరకు ఈసీఐ పనిచేస్తోందని టీఎంసీ, కాంగ్రెస్ ఆరోపించాయి. ఓటర్ల జాబితా యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో టీఎంసీ, ఈసీఐ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన పలు వార్తల్లో నిలిచింది.
2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిర్ణయాత్మకమైన తీర్పునిచ్చాయి. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆ పార్టీ 206 స్థానాలు గెలుచుకుని గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. గత ఎన్నికల్లో 77 స్థానాలు గెలుచుకున్న రాష్ట్రంలో ఇది ఒక పెద్ద మార్పు.
