హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మర్యాద పూర్వకంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని కోరారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రొఫెసర్ కోదండ రాం రెడ్డి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ కు సంబంధించి ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని విన్నవించారు గవర్నర్ కు సీఎం, మంత్రి.
ఇదిలా ఉండగా ఏ సభలో సభ్యుడు కానప్పటికీ దాదాపు ఆరు నెలలుగా అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల లోపు కచ్చితంగా ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎంపిక కావలసి ఉంటుంది..! దీని ప్రకారం ఆయన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ కు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. ఒకవేళ గవర్నర్ గనుక ఆమోదించక పోతే ఈ నెల 30 తర్వాత అజారుద్దీన్ తన మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంది..!
ఈ నేపథ్యంలోనే గవర్నర్ ను సీఎం కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఒకసారి కోదండరాం తో పాటు అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలు ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. బీ ఆర్ ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హై కోర్టు కు వెళ్లడంతో పెండింగ్ లో పడిపోయింది.! గతంలో వారి అభర్థిత్వాలను ఆమోదించేందుకు నాడు గవర్నర్ గా ఉన్న తమిళిసై నిరాకరించారు. రెండవసారి తీర్మానంలో అమీర్ అలీఖాన్ ను తప్పించి కోదండరాం తో పాటు అజారుద్దీన్ పేరును సిఫారసు చేస్తూ గవర్నర్ కు పంపించారు.. అయితే ఆరు నెలలు కావస్తున్నా గవర్నర్ కార్యాలయం నుండి ఎలాంటి స్పందన లేదు..
నిజానికి గవర్నర్ కోటలో ఇద్దరి ఎమ్మెల్సీల కోసం అభ్యర్థన పంపిన సమయంలో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఉన్నారు.. గత నెలలో ఆయన స్థానంలో శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు..! జాతీయ స్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తారా.. లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.. చూడాలి ఈ వారం రోజుల్లో ఈ జరగబోతుందో..!
