విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె కేంద్ర సర్కార్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో పాలన గాడి తప్పిందని, కేవలం స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారంటూ ఆరోపించింది. ఇవాళ విజయవాడలో షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లిగా మారి పోయాడని సంచలన వ్యాఖలు చేశారు. నారీ ముసుగులో డీ లిమిటేషన్ బిల్లు తెచ్చిన కపట సూత్రధారి అని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ప్రధాని పెట్టేవి పెడబొబ్బలు తప్పా మరోటి కాదన్నారు. మహిళా శక్తిని అడ్డుకున్నారని బీజేపీ ముసలి కన్నీరు. కార్చడం దారుణమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
33 శాతం రిజర్వేషన్ల అమలుకు అసలు ద్రోహి మోడీనేని వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. 2023 లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయకుండా, మళ్లీ పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు తెచ్చి.. దానికి పునర్విభజనతో లింక్ పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీద ఏడుపులు ఎందుకు ? మహిళలను మన్నించమని అడగడం ఎందుకు ?
రాజకీయ స్వలాభం కోసం విపక్షం మీద శాపనార్థాలు పెట్టడం ఎందుకు ? అని నిలదీశారు. ప్రధాని మోడీ కి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే, మహిళల ఆత్మ గౌరవం మీద పట్టింపు ఉంటే నారీ శక్తి వందన అభియాన్ 2024 చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
