డయేరియా , కల్తీ పాల వ్యవహారంపై సీఎం సీరియస్
వైద్యారోగ్యపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు ఘటనల్లో బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనల్లో బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. రెండు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై కారణాలను విశ్లేషించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఘటన జరిగాక స్పందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తత ద్వారా ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల్లోని జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే నివారించవచ్చని సీఎం అన్నారు. ప్రతి ప్రభుత్వ విభాగంలో కింది స్థాయి యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసేందుకు, ఆయా విభాగాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతి అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఒక్కో సందర్భంలో ఒక్కో శాఖపై ఆకస్మిక తనిఖీకి వెళ్లడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. కిందిస్థాయి అధికారులతో పాటు సంబంధిత శాఖల్లో జవాబుదారీ తనం పెరుగుతుందని అన్నారు. అప్పుడు ఇలాంటి ఘటనలు నివారించవచ్చని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్లు అంటే నిత్యం ప్రజల్లో ఉండాలని…అప్పుడే అనుకున్న మార్పు రాష్ట్ర స్థాయిలో చూపించగలమని సీఎం పేర్కొన్నారు. శ్రీకాకుళంలో తాగునీరు కలుషితం అయిన ఘటనలో ముందస్తు పర్యవేక్షణ, తనిఖీలు జరిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు.
