హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి . గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల అంశంపై గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిక్కులు లేకుండా ఒక “వే అవుట్” కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు.
సచివాలయం తన చాంబర్లో మంత్రులు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అనంతరం జర్నలిస్టుల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. జెఎన్జె జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గం చూపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికీ జేఎన్జే సొసైటీ జర్నలిస్టుల పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. జర్నలిస్టుల బాధలు తెలుసునని మంత్రి అన్నారు. పేదలకు కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వం పేటెంట్గా ఉందని, ఖమ్మం జిల్లా వెలుగుమెట్లలో పేదల ఇండ్లు కూల్చిన అంశంపై అర్హులైన పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్లు కట్టి ఇస్తుందన్నారు.
