అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. శనివారం ఈ మేరకు గత జగన్ మోహన్ రెడ్డి హయాంలో 2018వ సంవత్సరంలో నిర్వహించిన గ్రూప్ -1 నియామకాలలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళగిరి లోని సీఐడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ను సిట్ అధిపతిగా నియమించినట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆనాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆనాడు జరిగిన పరీక్షలలో, నియామకాలలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. వెంటనే నియామకాలకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. తక్షణమే జరగాలని ఏపీ కూటమి సర్కార్ కు స్పష్టం చేసింది. దీంతో ఏపీ కూటమి సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఏపీ డీజీపీకి తక్కువ కాని అధికారిని నిమించాలని జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది కోర్టు. ఇంప్లీడ్మెంట్ కోసం రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కి మూడు రోజుల్లోపు సిట్ వివరాలను అందించాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. ఇదిలా ఉండగా తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పు కలకలం రేపుతోంది రాష్ట్రంలో.
