Delhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం
ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం
Delhi Air Pollution : దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కుమ్మేసింది. మంగళవారం నమోదయిన వాయు నాణ్యత నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్ విభాగంలో చేరిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) తెలిపింది. దీపావళి తర్వాత 24 గంటల్లో సగటు పీఎం2.5 సాంద్రత ఒక క్యూబిక్ మీటర్కు 488 మైక్రోగ్రాములకు చేరింది. పండగకు ముందు ఇది 156.6 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది గతంలో 2024లో 330, 2023లో 218, 2022లో 312, 2021లో 382గా నమోదైందని సీపీసీబీ గుర్తు చేసింది.
Delhi Air Pollution Sensational
దీపావళి రోజ రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని సుప్రీంకోర్టు (Supreme Court) నిర్దేశించింది. అయితే, జనం ఆ పరిమితిని పట్టించుకోలేదు. అర్ధరాత్రి వరకు మోతమోగించారు. సోమవారం రాత్రి కాలుష్య కారక సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)స్థాయిలు 675కు చేరాయని సీపీసీబీ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీపై (Delhi) దట్టమైన బూడిదరంగు మంచు మేఘాలు కమ్ముకున్నాయి. వాయు నాణ్యత రెడ్ జోన్ స్థాయికి చేరుకుంది. వీటన్నిటికీ పంజాబ్ రైతుల పంటవ్యర్థాల దహనమే కారణమని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం నిషేధాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపింది. ఢిల్లీలో దీపావళికి ముందు ఏక్యూఐ 345 ఉండగా, మంగళవారం ఉదయం కేవలం 11 పాయింట్లు పెరిగి 356కి చేరుకుందని పేర్కొంది.
ఢిల్లీలోని (Delhi) వివిధ ప్రాంతాల్లో టపాసులు కాల్చడం ద్వారా వెలువడిన ఉద్గారాలు, గాలుల మందగమనం తదితర అంశాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని ‘క్లైమేట్ ట్రెండ్స్’ అధ్యయనం పేర్కొంది. దిల్లీ విశ్వవిద్యాలయ అనుబంధ రాజధాని కళాశాల ప్రొఫెసర్ ఎస్కే ఢాకా సైతం ఇదే విషయం తెలిపారు. హరిత బాణసంచా నాణ్యత, అందులో వాడే పదార్థాలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఇప్పటికే ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 (GRAP-2) నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాయు నాణ్యత సూచీ (AQI) దిగజారడంతో ‘సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)’ ఈమేరకు చర్యలు తీసుకుంది. జీఆర్ఏపీ-1 అమల్లోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఈ ఆంక్షలు విధించడం గమనార్హం.
లఖ్నవూలో మహిళా రైల్వేస్టేషన్
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూ సిటీ రైల్వేస్టేషన్ను మొత్తం మహిళలే నిర్వహించే రైల్వేస్టేషనుగా మార్చారు. కంట్రోల్ రూం నుంచి టికెట్ల విక్రయం వరకు ప్రతి పని మహిళా ఉద్యోగుల చేతుల మీదుగానే సాగుతుందని రైల్వేశాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, గస్తీ, సిగ్నల్ క్యాబిన్ల నిర్వహణ వంటి విధులకు మొత్తం 34 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరంతా దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. మహిళల సామర్థ్యం, నిబద్ధత, స్ఫూర్తికి అద్దం పట్టే ఈ స్టేషను నారీశక్తికి నిదర్శనమని ఈశాన్య రైల్వే అభివర్ణించింది.
Also Read : Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్
