Dial Your TTD EO : 15 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- డయల్ యువర్ ఈవోలో ధర్మా రెడ్డి
Dial Your TTD EO : తిరుమల – ఈనెల 15 నుండి 23 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ధర్మారెడ్డి.
Dial Your TTD EO New Program
గత నెల 18 నుండి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా చేపట్టామన్నారు. సీఎం జగన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారని తెలిపారు. గరుడ సేవ రోజు ఏడు ప్రత్యేక ప్రవేశ మార్గాల ద్వారా భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేలా చేశామని చెప్పారు.
భక్తులందరికీ అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ ఇచ్చామన్నారు. ఈనెల 14న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అంకురార్పణ జరగనుందని తెలిపారు ధర్మా రెడ్డి. ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 19న గరుడ సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణ రథం, 23న చక్ర స్నానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈవో.
ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. గరుడ వాహన సేవ రాత్రి 7 గంటల వరకు ఉంటుందన్నారు. అర్ధరాత్రి 12 గంటల దాకా దర్శనం కల్పిస్తామని తెలిపారు ధర్మా రెడ్డి.
ఉత్సవాల సందర్భంగా అష్ట దళ పాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశామన్నారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహన సేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న గరుడ సేవ కారణంగా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాక పోకలను రద్దు చేశామన్నారు.
Also Read : Asaduddin Owaisi : రేవంత్..రాహుల్ పై అసదుద్దీన్ ఫైర్
