అమరావతి : జలధార-జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్ల సహా జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జలధార కార్యక్రమం జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల సభ్యులు భాగస్వామ్యం బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. కార్యక్రమం మొదలు పెట్టిన తొలి రోజునే నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేయడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. నీటి సంరక్షణలో ఇప్పటికే తాను చేపట్టిన చర్యలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సులో వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ జలధార పేరుతో అద్భుతంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారని ప్రశంసలు కురిపించారు నారా చంద్రబాబు నాయుడు. అన్నమయ్య కలెక్టర్ తీసుకున్న చొరవతో 8.59 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. 20 వేల బోర్లు రీ-ఛార్జ్ అయ్యాయని తెలిపారు. ప్రతీ జిల్లా కూడా అన్నమయ్య జిల్లా మోడల్ ఫాలో కావాలని పేర్కొన్నారు సీఎం. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే కచ్చితంగా మార్పు కన్పిస్తుందన్నారు. ఈ దిశగా వర్క్ చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. నీటి సంరక్షణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని నిరూపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు.. వారి భాగస్వామ్యం ఉండేలా సాగునీటి సంఘాల సభ్యులు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు.
