హైదరాబాద్ : తెలుగు చలన చిత్రసీమలో తను ఓ ట్రెండ్ సెట్టర్. తీసిన తొలి సినిమాతోనే షేక్ చేసిన వ్యక్తి. అతనే రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి. తను ఏప్రిల్ 7న, 1962లో పుట్టాడు. నేటికీ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాను ఆయన వాడుకున్నంత ఇంకెవరూ వాడుకోవడం లేదు. సినిమాకు సంబంధించి 24 ఫ్రేమ్స్ గురించి చెప్పే అతి కొద్దిమంది దర్శకులలో తను కూడా ఒకడు. తెలుగు సినిమా గతిని, గమనాన్ని శివ అనే మూవీతో మార్చిన వాడు రామ్ గోపాల్ వర్మ. వృత్తి పరంగా సినీ దర్శకుడు, నిర్మాత, ప్రవృత్తి రీత్యా రచయిత. మేధావి. ఆలోచనాపరుడు. ఒక రకంగా సినీ తత్వవేత్త అని చెప్పక తప్పదు. నీషే ఫిలాసఫీని ఇష్ట పడతాడు. తను తీసిన సినిమాలు తన ప్రతిభను తెలియ చేస్తాయి. తను ఎందరికో లైఫ్ ఇచ్చాడు. మరెందరికో మార్గదర్శకంగా మారాడు.
ఇటు తెలుగు పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన రామ్ గోపాల్ వర్మ. భారతీయ సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా బాలీవుడ్ ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. ఎవరూ చేయని సాహసాన్ని తను చేశాడు. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ ల మాఫియాను కళ్లకు కట్టినట్లు సెల్యూలాయిడ్ మీద ఆవిష్కరించాడు రామ్ గోపాల్ వర్మ. 1989లో తీసిన శివ అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ. ఈ సినిమా ఆయనకు గొప్ప పేరు తీసుకొచ్చింది. తెలుగు సినిమాల్లో యాక్షన్ , టెక్నికల్ స్టైల్ను పూర్తిగా మార్చేసింది. బాలీవుడ్ లో తీసిన రంగీలా సెన్సేషన్ క్రియేట్ ఏసింది. 1998లో తీసిన సత్య దుమ్ము రేపింది. 2002లో వచ్చిన కంపెనీ విమర్శకులు సైతం విస్తు పోయేలా చేసింది. 2005లో బాల్ థాక్రే జీవితం ఆధారంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో తీసిన సర్కార్ బాలీవుడ్ ను షేక్ చేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం కొత్త కెమెరా టెక్నిక్లు ఉపయోగించడం తనకు వెన్నెతో పెట్టిన విద్య. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆర్జీవికి నీషే అంటే చచ్చేంత ఇష్టం. ఎన్నో సినిమాలు, మరెన్నో వివాదాలు ఉన్నప్పటికీ తను ఇప్పటికీ ఎవర్ గ్రీన్ దర్శకుడని చెప్పక తప్పదు.
