అమరావతి : ఏపీ కూటమి సర్కార్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, సామాన్యులకు, ప్రధానంగా తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. బాబూ ఇంకెంత మందిని బలి తీసుకుంటావో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా సీరియస్ గా స్పందించారు. అసలు మీరు పాలించేందుకు అర్హులేనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాజకీయ కక్షలతో పలువురిని టార్గెట్ చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారంటూ నిలదీశారు జగన్ రెడ్డి.
అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేస్తారా? పైగా సాల్మన్ పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది? ఈ ఘటన ముమ్మాటికీ వైయస్సార్సీపీని భయ పెట్టడానికి, కట్టడి చేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగం తప్ప మరోటి కాదన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ, ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఆరోపించారు.
