తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి

ఘ‌నంగా నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన అరుదైన నాయ‌కుడు మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త సూదిని జైపాల్ రెడ్డి అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాజకీయాలకు విలువల విలువ తెలిపి, ప్రజాసేవకు నిస్వార్థమే పరమార్థమని చెప్పిన అరుదైన నేత అని పేర్కొన్నారు. స్వరాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియలో తన చాణక్య నీతి చూపిన తెలంగాణ ముద్దుబిడ్డ‌గా అభివ‌ర్ణించారు రేవంత్ రెడ్డి. శుక్ర‌వారం సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైద‌రాబాద్ లోని నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తిస్థల్ వద్ద సహచర నాయకులతో కలిసి ఘన నివాళి అర్పించారు. రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ సహచరులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఇక్కడ స్ఫూర్తి స్థల్ వద్ద జరిగిన జైపాల్ రెడ్డి 84వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. తాను జైపాల్ రెడ్డిని చూసి స్పూర్తి పొందాన‌ని అన్నారు. అత్యుత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడ‌ని ఆయ‌న లాంటి నాయ‌కుడు మ‌ళ్లీ పుట్ట‌ర‌ని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. త‌ను ఊపిరి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం, రాష్ట్రం అభివృద్ది కోసం పాటు ప‌డ్డాడ‌ని, ఆయ‌న వ‌స్తున్నాడంటేనే పార్ల‌మెంట్, శాస‌న స‌భ ద‌ద్ద‌రిల్లేద‌ని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయ‌న త‌మ‌కు బంధువు కావ‌డం కూడా గ‌ర్వంగా ఉంద‌న్నారు . పాల‌మూరు బిడ్డా నిను మ‌రువ‌దు ఈ గ‌డ్డ అని ఇప్ప‌టికీ త‌న గురించి స్మ‌రించు కుంటార‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!