అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా తన స్వంత ఊరు నారా వారి పల్లెలో సేద దీరారు. కుటుంబంతో కలిసి పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా జగ్గన్నతోట ప్రభలతీర్థం పండుగ సందర్బంగా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కాంక్షించారు. ఇదే సమయంలో తిరుపతి జిల్లాపై సమీక్ష చేపట్టారు. స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
కందులవారిపల్లి, చిన్న రామాపురం, ఎ రంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లికి కార్యక్రమానికి ఎంపిక చేశామన్నారు. ఈ ప్రత్యేక ప్రాజెక్టు అమలు ద్వారా ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. అన్ని ఇళ్లకూ వంద శాతం సౌర ప్యానెళ్లను అమర్చడం, శాస్త్రీయ పద్ధతుల్లో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తరణ తదితర ప్రణాళికల ద్వారా స్థానికుల తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగిందని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో చంద్రగిరి మండలం అంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలని స్పష్టం చేశారు. నిర్థేసించుకున్న ఫలితాలను ఏడాదిలోపు సాధించాలని అధికారులకు సూచించారు. స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలుతో ఏడాదిలో ఈ మండలంలోని ఆయా గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడే పరిస్థితిని తీసుకు వస్తాం అన్నారు.
